PM Narendra Modi speaks to Lankan president, assures continued support after Cyclone Ditwah's wrath
దిత్వా తుఫాన్ శ్రీలంకలో విధ్వంసం సృష్టించింది. ఈ తుఫాన్ ధాటికి దాదాపు 300మందికి పైగా మరణించగా.. వందలాది మంది గల్లంతయ్యారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ప్రభావితమవడంతో శ్రీలంక ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. సుమారు లక్షన్నర మందిని తాత్కాలిక పునరావాస శిబిరాలకు తరలించారు. శ్రీలంకలో తుఫాను సృష్టించిన ప్రాణనష్టం, విస్తృత విధ్వంసంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తుఫాను అనంతర పరిస్థితి, సహాయక చర్యలపై శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకేతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా అన్ని విధాల అండగా మోదీ హామీ ఇచ్చారు. తుఫాను వల్ల జరిగిన ప్రాణనష్టం, నష్టంపై ప్రధాని మోదీ తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. . ఈ కష్ట సమయంలో భారత్ ఎప్పుడూ శ్రీలంకకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విపత్తు జరిగిన వెంటనే సహాయక బృందాలను, సామగ్రిని పంపినందుకు అధ్యక్షుడు దిసానాయకే భారత్కు ధన్యవాదాలు తెలిపారు. భారత సహాయం చాలా వేగంగా, ప్రభావవంతంగా ఉందని శ్రీలంక ప్రజలు ప్రశంసించారని ఆయన తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఆపరేషన్ సాగర్ బంధు కింద బాధితులకు రక్షణ, సహాయం అందిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. శ్రీలంకలో పునరావాస పనులు, ప్రజా సేవలు తిరిగి ప్రారంభం కావడానికి, జీవనోపాధిని పునరుద్ధరించడానికి అవసరమైన సహాయాన్ని భారత్ భవిష్యత్తులో కూడా అందిస్తూనే ఉంటుందని తెలిపారు. ఇద్దరు నాయకులు భవిష్యత్తులోనూ సన్నిహితంగా ఉంటూ సహకారాన్ని కొనసాగించాలని నిర్ణయించారు.